పేద కార్మికులకి రూ.51 ల‌క్ష‌ల సాయం చేసిన స్టార్ హీరో

సంక్షోభం స‌మ‌యంలో కేంద్రంతో పాటు రాష్ట్రప్రభుత్వాలకు విరాళాల్ని అందిస్తూ తమ సహృదయతను చాటుకుంటున్నారు బాలీవుడ్‌ ప్రముఖులు. హీరో అజయ్‌ దేవ్‌గణ్‌ తన నిర్మాణ సంస్థ అజయ్‌ దేవ్‌గణ్‌ ఫిల్మ్స్‌ ద్వారా కోటి పది లక్షల రూపాయల్ని పీఏం కేర్స్‌కు విరాళంగా ఇచ్చిన విష‌యం తెలిసిందే. ఒకరికొకరం అండగా నిలవాల్సిన సమయమిదని, ప్రతి ఒక్కరూ ఇంట్లోనే ఉంటూ కరోనాను అంతమొందించాలని అజయ్‌దేవ్‌గణ్‌ అన్నారు.


ఇక లాక్ డౌన్ కారణంగా సినీ ప‌రిశ్ర‌మ‌పై ఆధార‌ప‌డి జీవిస్తున్న రోజువారీ కార్మికులు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు. కుటుంబ పోష‌ణ భారంగా ఉన్న వారికి త‌న వంతు సాయాన్ని అందించేందుకు అజ‌య్ దేవ‌గ‌ణ్ ముందుకు వ‌చ్చారు. ఫెడ‌రేష‌న్ ఆఫ్ వెస్ట్ర‌న్ ఇండియా సినీ ఎంప్లాయిస్ సంస్థ‌కి రూ. 51 ల‌క్ష రూపాయ‌ల‌ని విరాళంగా అందించారు. 5 ల‌క్ష‌ల సినీ కార్మికుల స‌హాయార్ధం రూ.51 ల‌క్ష‌ల రూపాయ‌ల‌ని అజ‌య్ దేవ‌గ‌ణ్ ఎఫ్‌డ‌బ్ల్యూఐసీఈ సంస్థ‌కి అందించ‌డం సంతోషంగా ఉంద‌ని అధికారి అశోక్ పండిట్ తెలిపారు. క్లిష్ట ప‌రిస్థితుల‌లో మీరు ఎల్ల‌ప్పుడు అండ‌గా ఉంటార‌నే విష‌యాన్ని మ‌రోసారి నిరూపించారు. యూ ఆర్ రియ‌ల్ లైఫ్ సింగం అంటూ అశోక్ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు.